తిరుమల వేంకటేశ్వరుని పంచరూపాలు ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం | Unknown Facts About Tirumala Sri Venkateswara Swamy

తిరుమల వేంకటేశ్వరుని పంచరూపాలు ..

తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి.

ఈ మూర్తులు వరుసగా .

> భోగ శ్రీనివాసమూర్తి,

> ఉగ్ర శ్రీనివాసమూర్తి,

> మూలమూర్తి,

> కొలువు శ్రీనివాసమూర్తి,

> శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు.

ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో  తెలుసుకుందాం.

మూలమూర్తి (ధ్రువబేరం) :

నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

భోగ శ్రీనివాసమూర్తి (కౌతుకబేరం):

ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.

ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపనబేరం):

ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి (ఉత్సవబేరం):

13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.

కొలువు శ్రీనివాసమూర్తి ( బలిబేరం):

గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.

♦తిరుమలలో మొదటి గంట♦ 

నైవేద్యం సుప్రభాతసేవ, అభిషేకాలు, కొలువు, సహస్రనామార్చనల తర్వాత శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూస్తారు. తిరుమామణి మంటపంలో రెండుసార్లు గంటలు మోగిస్తారు. ఇలా తిరుమామణి మంటపంలో గంటలు మోగగానే అర్చకులు స్వామివారికి తొలి నైవేద్యం సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తారు. జీయంగారు లేదా ఆయన సహాయకుడు వైష్ణవ సంప్రదాయంలోని ప్రబంధ అధ్యాయాలను పఠిస్తారు. దీన్ని సట్టుమురా అంటారు. వేంకటేశ్వరుని ముందు మెట్టుకు ఇవతలి నుండి నైవేద్యం పెడతారు. స్వామివారికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనం, లడ్డూలు, వడలు, పొంగలి, చక్రపొంగలి, అప్పాలు, పోళీలు నివేదిస్తారు.

నైవేద్యం స్వామివారికే కాకుండా విష్వక్సేనుడు, గరుడుడు, నిత్యాసురులకు కూడా నివేదిస్తారు. ఇలా గంటలు మోగించి, నైవేద్యం సమర్పించడాన్ని వ్యవహారంలో మొదటి గంట లేదా ఆలయ మొదటి గంట అంటారు.

♦తిరుమలలో రెండో గంట, అర్చన ♦

తిరుమలేశుని దేవాలయంలో అష్టోత్తర శతనామార్చన తర్వాత రెండో గంట మోగిస్తారు. ఈ సంప్రదాయాన్ని రెండో గంట లేదా అపరాహ్న పూజ ( Second Bell or Aparahna Pooja) అంటారు. ఇలా రెండో గంట మోగించినప్పుడు స్వామివారికి రెండోసారి నైవేద్యం సమర్పిస్తారు. రెండోసారి జరిగే ఈ అర్చనలో ''వరాహపురాణం'' లోని శ్రీ వేంకటేశ్వరుని నామావళిని జపిస్తారు. పోటు నుండి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆనక తాంబూలం సమర్పించి, కర్పూరహారతి ఇస్తారు.

తిరుమల వేంకటేశ్వర ఆలయంలో రెండో గంట మోగినప్పుడు చేసే అష్టోత్తర నామార్చనను చూసేందుకు భక్తులను అనుమతించరు. ఇది ఏకాంత సేవ. ప్రత్యేక సేవలకోసం టికెట్లు కొనుక్కున్న భక్తులు నివేదించిన ''చెరుపులు'' (పులిహోర, దద్దోజనం), ''పన్యారాలు'' (లడ్డూలు) మొదలైన నైవేద్యాలను తిరుమల వేంకటేశ్వరునికి సమర్పిస్తారు. భక్తులు తెచ్చిన దాంట్లో నుండి కొంత మాత్రమే వేంకటేశ్వరునికి సమర్పించి, తక్కిన పదార్ధాలను వారికి తిరిగి ఇచ్చేస్తారు.

♦తిరుమలలో మూడో గంట♦

తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ఉదయం జరిపే తోమాలసేవ, రాత్రిపూట కూడా జరుపుతారు. ఆ సేవ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేస్తారు. శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు. ఆ సమయంలో మూడో గంట మోగిస్తారు. అప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం సర్వదర్శనం తిరిగి ప్రారంభమౌతుంది.

♦తిరుమల విమాన వేంకటేశ్వర స్వామి♦

పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిదిమంది , స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిదిమంది అర్చకులనూ విచక్షణా రహితంగా అక్కడికక్కడే చంపేశాడు.

నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిదిమందిని హత్య చేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు. మహా పాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. పన్నెండేళ్ళ పాటు భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించలేదు. వ్యాసరాయలవారు గర్భగుడిలో ప్రవేశించి, పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట.

ఆ పన్నెండేళ్ళ కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ, అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే విమాన వేంకటేశ్వర స్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టించిన విమాన వేంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది.

ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వేంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు, వెండి పూత పూసి, మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వరుని దర్శించుకుంటారు.

Famous Posts:

Tags : TTDTempleHistory, Tirumala tirupahti, తిరుమల, tirumala temple secrets in telugu, tirupati balaji miracles, tirupati balaji idol history.

Comments