విభూతి ధారణ దాని వల్ల కలిగే అద్భుత లాభాలు - Importance of Benefits of Vibhuti dharana in Telugu

విభూతి ధారణ ప్రాముఖ్యత...

విభూతిని ధరించి నప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణవలన తొలగి మన బాధలు నశిస్తాయి.

కనుక ప్రతివాడు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాలభాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం, దేవతారాధనచేసి ఈశ్వరకృపకు పాత్రుడై దినచర్యలకు సమాయత్తం కావాలి.

విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపజేస్తుంది.

""విభూతిర్భూతిరైశ్వర్యమ్‌''

విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగాన్నుండి వెలువడే ఆవుపేడతో విభూతి తయారు చేసికోవాలి. లక్ష్మీ గోవు యొక్క పృష్ఠభాగంలో వున్నట్లే ఇతరదేవతలు కూడ గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో వుంటారు. కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యం వున్నది. దానినుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం.

లక్ష్మీ ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తుంది. గోవు యొక్క పృష్ఠభాగం, వివాహిత స్త్రీ యొక్క పాపటభాగం, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వదళాలు.

“వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయా ! పూజితో పి మహాదేవో నా భీష్ట ఫలదాయక!!

భస్మం నొసట మూడు రేఖలు ధరింపనిదే .రుద్రాక్ష మాలను కంతమున ధరింపనిదే శంకరుని పూజించినను భక్తుల కోరికలు నెరవేరవు.

అమరేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి ధార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి, ఎవరైతే శివప్రీతికరమైన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటి ఉంటుందంటారు.

విభూతి - భసితరి, భస్మ, క్షారము రక్షక పర్యాయ వాచక పదాలు. ఆణిమ, మహిమ, గరిమ, లఘుమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం, వశిత్వం అనే అష్టసిద్దులను బాసింపచేస్తుంది. కనుక భసితమైందనీ, పాపాలను భజించడంవల్ల భస్మమైంది. ఆపదల నుండి కాపాడడంవల్ల క్షారమైంది. భూత, ప్రేత పిశాచాది గ్రహ బాధల నుండి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయ్యింది. ‘విభూతి’ని శరీరంపై పూసుకోవటంవల్ల తిర్వక్త్రిపుండ్రం పెట్టుకోవడంవల్ల స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణముండడంచే సదానొసట విభూతిని ధరించి తీరాలని, మనం పూజా కార్యక్రమాలాంటివి చేయకపోయినా నిత్యం విభూతి ధరిస్తే శివపూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి.

విభూతి ధారణవల్ల అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి విద్యా స్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెల్పితే, విభూతి ధరించేవారు దీర్ఘవ్యాధులు లేకుండా పూర్ణాయుర్దాయ వంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని, దుఃఖాలు, రోగాలు, తొలగి శుభాలను కల్గిస్తుందని పురాణాల ద్వారా మనకు విదితవౌతుంది.

విభూతి మూడు విధాలు. ‘శ్రౌతము’ అంటే చెప్పబడిన విధి విధానంతో, అంటే వేదములలో నిర్ణయింపబడినట్లుగా యజ్ఞ యాగాదులు చేసి, ఆ హోమాదులవల్ల ఏర్పడిన భస్మం. ‘స్మార్తము’ అంటే నిత్యాగ్ని హోత్రాదులు చేయగా ఏర్పడిన భస్మం. ‘లౌకికము’ ఆవు పేడను కాల్చడం ద్వారా తయారైన భస్మము. ఇలా మూడు విధాలైన భస్మములను పవిత్రమైన ‘విభూతి’గా భావిస్తారు.వైరాగ్యమునకు, నిర్లిప్తతకు ప్రతీకగా భస్మమును భావించి త్రిపుండ్ర ధారణ చేయుట సర్వోత్తమము.

సర్వసృష్టికి హేతుభూతమైన నిత్యచైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతిధారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతివిషయం శివమయమని, అదేమనకు అంతిమలక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే, అది ముందు నల్లగా మారుతుంది. దానినింకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దాన్ని ఇంకాకాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్నిరకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిద మాత్రమే. కనుక భౌతికరంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్యస్థితి కల్గియున్నది. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతివస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.

Famous Posts:

Tags : విభూతి ధారణ, భస్మధారణ, Bhasma Dharana, Vibhuti Dharana, Vibhuti Dharana Telugu, Bhasma Dharana Slokam

Comments